పవన్, బండి సంజయ్ లను బలహీనం చేసేందుకు జగన్, కేసీఆర్​ కుట్ర: కన్నా లక్ష్మీనారాయణ

  • జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే ఏపీ నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని వ్యాఖ్య
  • వియ్యంకుడు బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో సోము వీర్రాజు చెప్పాలని డిమాండ్ 
  • పవన్ కు తాము అండగా ఉంటామని ప్రకటించిన కన్నా
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో చేరారని, దీనికి వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని ఆరోపించారు. 

ఆంధ్రాలో పవన్ కల్యాణ్ ను, తెలంగాణలో బండి సంజయ్‌ ను బలహీనం చేసే కుట్ర జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్నారని అన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు. ఈ సమయంలో పవన్‌కు తాము అండగా ఉంటామని చెప్పారు. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.  

ఇక, ఏపీలో బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పును కన్నా తప్పుబట్టారు. ఈ విషయంలో సోము వీర్రాజుపై అసహనం వ్యక్తం చేశారు. కోర్ కమిటీలో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చడం ఏమిటని ప్రశ్నించారు. అధ్యక్షుల మార్పు విషయం గురించి తనతో చర్చించలేదన్నారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లే అని చెప్పారు. తాను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎంతో మందిని బీజేపీలో చేర్చానని కన్నా తెలిపారు. అయితే, ఇప్పుడు వాళ్లంతా ఎందుకు పార్టీ వీడుతున్నారో వీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

YSRCP
Jagan
KCR
Pawan Kalyan
Bandi Sanjay
Kanna Lakshminarayana
Andhra Pradesh
Telangana

More Telugu News